అంటువ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-11-13T10:05:25+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం డెంగీ, మలేరియా నియంత్రణలో ఉందని డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి అన్నారు.
డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి
హన్మకొండ అర్బన్, నవంబరు 12: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం డెంగీ, మలేరియా నియంత్రణలో ఉందని డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి అన్నారు. ముందస్తు జాగ్రత్తగా కొవిడ్తో పాటు కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎన్వీబీడీసీపీ ప్రోగ్రాం అధికారులు, సబ్యూనిట్ అధికారులతో డీఎంహెచ్వో కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ఎన్వీబీడీసీపీ అధికారుల సమీక్ష, శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ లలితాదేవి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మలేరియా-221, డెంగ్యూ- 81 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఎన్వీబీడీసీపీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎ.ప్రభావతి మాట్లాడుతూ.. పట్టణాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ శాఖ సమన్వయంతో లార్వాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రై డే నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వరంగల్ నగరంతోపాటు, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్లోని అటవీప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ టి.మదన్మోహన్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ.నాగయ్య, రూరల్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ క్రాంతికుమార్, జిల్లా మాస్మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, ములుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ సీతారామరాజు, సబ్ యూనిట్ అధికారులు లింగమూర్తి, పరంజ్యోతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.