రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే గండ్ర
ABN , First Publish Date - 2020-11-13T09:54:20+05:30 IST
రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గడ్రం వెంకటరమణారెడ్డి అన్నారు.
భూపాలపల్లి కలెక్టరేట్, నవంబరు 12 : రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గడ్రం వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై ఇల్లందు క్లబ్హౌ్సలో జేసీ కూరాకుల స్వర్ణలత అధ్యక్షతన గురువారం జరిగిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర హాజరయ్యారు. గత ఏడాదిలా సమస్యలు తలెత్తకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ముందస్తుగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా చూడాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, ఎలక్ర్టానిక్ వేయింగ్ మిషన్, తేమ యంత్రం ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు టోకెన్లు జారీ చేసి కొనుగోలు చేయాలన్నారు. రిజిస్టర్లో రికార్డుచేసి తూకం వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జిలుగా సమర్థులను నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, గన్నీబ్యాగుల కొరత లేకుండా పర్యవేక్షించాలన్నారు. ధాన్యం మిల్లులకు చేరడంలో తాత్సారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ స్వర్ణలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, మిల్లర్లు నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శోభ, డీఎం రాఘవేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.