‘పట్టణ ప్రగతి’ నిరంతరం కొనసాగుతుంది

ABN , First Publish Date - 2020-03-02T11:19:55+05:30 IST

‘పట్టణ ప్రగతి’ నిరంతరం కొనసాగుతుంది

‘పట్టణ ప్రగతి’ నిరంతరం కొనసాగుతుంది

వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి

పట్టణ ప్రగతి సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సంపేట పట్టణ ప్రగతి పనులపై మంత్రి అసంతృప్తి


నర్సంపేట, మార్చి1: పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్ధేశంతో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పట్టణ ప్రగతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతికి రూ:74కోట్ల కేటాయించినట్లు తెలిపారు. నర్సంపేటకు 32లక్షలు కేటాయించారని, ఒక్కో వార్డులో మౌలిక సమస్యల పరిష్కారానికి రూ.లక్షా 50వేలు వినియోగించుకునే అవకావం ఉందన్నారు. అన్ని వార్డుల్లో చెత్తకుండీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ ఇంటిలో తడి, పొడి చెత్తబుట్టలు ఉండేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పట్టణంలో పందుల బెడద అరికట్టడానికి పందుల పెంపకం దారులతో సమావేశం నిర్వహించి పట్టణానికి దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. పందుల పెంపరందారులకు ప్రత్యామ్నాయ ఉపాధికోసం రూ:2లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 75గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకోవచ్చాన్నారు. 75నుంచి 200 గజాలు, ఆపై ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టుకునే వారు మునిసిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏషాపు ముందు చెత్త ఉంటుందో ఆ షాపు యజమానికి రూ:5వేల మేరకు జరిమానా విధించాలని మునిసిపల్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి కొనసాగుతున్నా ఇలా చెత్త, చెదారం ఉండడట మేమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. నర్సంపేటలో పట్టణ ప్రగతి పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ప్రధానరోడ్ల వెంట పర్యటించిన మంత్రి...

నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ హరిత, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం పర్యటించారు. మల్లంపల్లిరోడ్‌, వరంగల్‌రోడ్‌లోని ప్రధాన రహదారుల వెంట అధ్వాన్నంగా ఉన్న డ్రెయినేజీలను, రోడ్ల పక్కన ఉన్న చెత్తకుప్పలను పరిశీలించారు. డ్రెయినేజీల్లో చెత్తపారబోయడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని, ఎందుకు డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం లేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొబ్బరిబొండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని షాపు వారికి సూచించారు. షాపుల ముందు చెత్తవేయవద్దని షాపుల యజమానులకు ఆయన సూచించారు. 


ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 24వార్డులను అభివృద్ధి చేసుకునేందుకు పట్టణ సమస్యలను గుర్తించి జాబితాను మునిసిపల్‌ కార్యాలయంలో అందజేస్తే సమస్యల పరిష్కారానికి నిధులను కేటాయించి పనులు చేపడుతారన్నారు. నర్సంపేటను మోడల్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సమావేశం అనంతరం 9,10 వార్డులకు చెందిన మహిళలకు తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.


కార్యక్రమంలో కలెక్టర్‌ హరిత, జేసీ మహేందర్‌రెడ్డి, ఆర్డీవో హరిసింగ్‌, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, తహసీల్దార్‌ రాంమూర్తి,  మునిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజని, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌,  కౌన్సిలర్లు రాయిడి కీర్తి, దుశ్యంత్‌రెడ్డి, శీలం రాంబాబు, రమాదేవి, పద్మ, సునీత, మల్లీశ్వరి,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:19:55+05:30 IST