ఎమ్మార్వో నాగరాజు వెనుక ఉన్న ఎంపీ ఎవరు?: వీహెచ్
ABN , First Publish Date - 2020-08-16T22:52:56+05:30 IST
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ లేఖ ఏ ఎంపీదో బయటపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత

హైదరాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ లేఖ ఏ ఎంపీదో బయటపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(విహెచ్) డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆదివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. నాగరాజు వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఎంకి చిత్తశుద్ధి ఉంటే భూ బకాసురుల చిట్టా బయటపెట్టాలన్నారు. ఈనెల 19వ తేదీన కీసర వెళతానని, వివరాలను బయటపెడతానని అన్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి ఊరుకుంటే సరిపోదని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేశారు. కీసర ఎమ్మార్వో ఘటన తరువాత కలెక్టర్ ఉద్యోగం కూడా అవసరం లేదని.. ఐదేళ్లు ఎమ్మార్వోగా ఉంటే చాలని కలెక్టర్లు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గ్రేటర్, దుబ్బాక ఎన్నికల అంశంపై వీహెచ్ స్పందించారు. ఎన్నికల అంశంపై చర్చ పెట్టాలన్నారు. కోర్ కమిటీ పెట్టాలని పీసీసీకి పదే పదే చెప్తున్నానని అన్నారు.