వరవరరావును విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-06-01T08:39:40+05:30 IST

ముంబై జైలులో అస్వస్థతకు గురైన వరవరరావును విడుదల చేసి, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం

వరవరరావును విడుదల చేయాలి

  • చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలి
  • ప్రధాని మోదీకి సురవరం లేఖ
  • కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి: నారాయణ, చాడ
  • ఉద్ధవ్‌ ఠాక్రేకు మాడభూషి, శైలేష్‌ గాంధీ లేఖ


హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ముంబై జైలులో అస్వస్థతకు గురైన వరవరరావును విడుదల చేసి, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరవరరావును ఉంచిన జైలులోనే ఒక ఖైదీ కరోనాతో మృత్యువాత పడినట్టు తెలిసిందని పేర్కొన్నారు. వరవరరావు విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఆయనను హైదరాబాద్‌కు తీసుకురావాలని, లేకుంటే ఆయన కుటుంబ సభ్యులు ముంబై వెళ్లడానికి అవకాశం కల్పించాలని కోరారు.


ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ స్పందించి వరవరరావును బెయిల్‌పై లేదా పెరోల్‌పై విడుదల చేయించాలని చాడ  విజ్ఞప్తి చేశారు. వరవరరావు, సాయిబాబను బేషరతుగా విడుదల చేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విద్యానగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన తెలిపినట్టు నాయకురాలు ఎస్‌ఎల్‌.పద్మ తెలిపారు. వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు కేంద్ర సమాచార మాజీ కమిషనర్లు మాడభూషి శ్రీఽధరాచార్యులు, శైలేశ్‌గాంధీ లేఖ రాశారు. పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు బృందాలు 16 వారాల పాటు దర్యాప్తు చేసినా ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని వారు పేర్కొన్నారు. ఎన్‌ఐఏ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకోవడం రాష్ట్ర అఽధికారాన్ని కేంద్రం లాగేసుకోవడమేనని విమర్శించారు. వరవరరావును హైదరాబాద్‌కు తీసుకురావాలని, ఆయనను కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కల్పించాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు.


ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబను కూడా పెరోల్‌పై విడుదల చేయాలని కోరారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వరవరరావు, సాయిబాబను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేసింది. వారిద్దరి విడుదలకు జోక్యం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో పీడీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, ప్రజా కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌, ఏఐఎ్‌సటీయూ జాతీయ కన్వీనర్‌ షేక్షావలి, ప్రజా హక్కుల కమిటీ అధ్యక్షుడు మేడ రవి తమ ఇళ్లలో ఒకరోజు దీక్ష చేశారు.

Updated Date - 2020-06-01T08:39:40+05:30 IST