వందే తెలంగాణ
ABN , First Publish Date - 2020-05-09T10:34:17+05:30 IST
లాక్డౌన్ కాలంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతుంటే, తెలంగాణకు తిరుగు వలసలు మొదలయ్యాయి. బిహార్ నుంచి 225మంది కూలీలు పనులు చేసుకునేందుకు ప్రత్యేక రైల్లో శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణ నుంచి
- రాష్ట్రానికి తిరుగు వలసలు
- బిహార్ నుంచి రైల్లో లింగంపల్లికి 225 మంది
- వీరంతా రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలు
- ప్రత్యేక బస్సుల్లో జిల్లాల్లోని మిల్లులకు తరలింపు
- బిహార్లో కూలీ రూ.300 మాత్రమే..
- తెలంగాణలో 1200: సుశీల్ మోదీ
- 2వేల మిల్లుల్లో లోడింగ్కు హమాలీల సమస్య
- కూలీలను పంపాలని బిహార్ను కోరాం: గంగుల
మియాపూర్, న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ కాలంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతుంటే, తెలంగాణకు తిరుగు వలసలు మొదలయ్యాయి. బిహార్ నుంచి 225మంది కూలీలు పనులు చేసుకునేందుకు ప్రత్యేక రైల్లో శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణ నుంచి బయలుదేరిన శ్రామిక్ స్పెషల్ రైలు గురువారం పట్నాకు చేరుకుంది. అదే రోజు తిరిగి తెలంగాణకు పయనమైన ఆ రైల్లో బిహార్ ముంగేర్ డివిజన్ ఖగారియాకు చెందిన, రైసు మిల్లుల్లో పనిచేసే 225మంది హమాలీలు ఎక్కారు. వీరంతా శుక్రవారం లింగంపల్లి స్టేషన్లో దిగారు. అప్పట్లో తెలంగాణలోనే ఉండి పనులు చేసుకున్న వీరంతా హోలీ పండగ కోసం స్వస్థలాలకు వెళ్లారని, లాక్డౌన్ ప్రకటించడంతో తమ ప్రాంతంలోనే ఉండిపోయారని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. ఖగారియాకు చెందిన పనివాళ్లను తిరిగి తమ రాష్ట్రానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని తమను గత 25 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం సంప్రదిస్తోందని వెల్లడించారు. బిహార్లో రోజుకు కూలీ రూ.300 మాత్రమేనని, తెలంగాణలో ఖగారియా పనివాళ్లకు రూ.1200 వందలు ఇస్తున్నారని.. అందుకే తెలంగాణ వెళ్లేందుకు కూలీలు కూడా ఆసక్తి కనబరిచారని చెప్పారు. కాగా పట్నా నుంచి ప్రత్యేక రైల్లో లింగంపల్లికి చేరుకున్న బిహార్ కార్మికులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ నోడల్ అధికారి సందీ్పకుమార్ సుల్తానియా, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి పూలతో స్వాగతం పలికారు. యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం కొన్నామని, 2 వేల రైస్ మిల్లులు, దాన్యం కొనుగోలు కేంద్రాల్లో, లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కూలీల తరలించాలని బిహార్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో బిహార్ నుంచి 225 మంది హమాలీలు శుక్రవారం లింగంపల్లికి చేరుకున్నారని తెలిపారు. అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, మిల్లుల్లో పనిచేసేందుకు నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేటకు ప్రత్యేక బస్సుల్లో తరలించామని చెప్పారు.