ఉత్తమ్‌ను కొనసాగించడమే ఉత్తమం

ABN , First Publish Date - 2020-06-01T08:12:41+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించాలని, రేవంత్‌కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉత్తమ్‌ను కొనసాగించడమే ఉత్తమం

  • రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వొద్దు
  • నాపై కక్ష సాధిస్తే.. రాజకీయాల్లోకి నా కూతురు
  • మా పార్టీలో కోవర్టులు ఉన్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించాలని, రేవంత్‌కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా తనపై కక్ష సాధింపు చర్యలకు దిగితే.. తన కుమార్తె జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. ‘‘లాక్‌డౌన్‌ ముగియడంతో మా పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడి మార్పుపై మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేనంటే నేను అని 20మంది చెప్పుకుంటున్నారు’’అని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆదివారం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్‌ను మార్చాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల వరకూ ఉత్తమ్‌ సారథ్యమే ఉత్తమమని వ్యాఖ్యానించారు. ఈ విషయమై రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు. తనను అడుగకుండా రేవంత్‌కు పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకు ఉంటుందని, కొత్త ఆలోచన సైతం ఉందని అన్నారు. రేవంత్‌ను తప్పించి ఎవరికి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.


తాను సైతం టీపీసీసీ రేస్‌లో ఉన్నానని వివరించారు. ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్‌నే బాధ్యుడిని చేయడం తప్పని అన్నారు. ఆ విషయానికొస్తే అందరినీ గెలిపిస్తానంటూ తిరిగిన రేవంత్‌ సైతం ఓడిపోయారని, దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రె‌స్‌లో చాలా మంది కోవర్టులు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. రాత్రిపూట కర్ఫ్యూను డిసెంబరు వరకు పొడిగించాలని సూచించారు.

Updated Date - 2020-06-01T08:12:41+05:30 IST