తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రానికి స్థలం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-09-14T09:48:26+05:30 IST
: హైదరాబాద్లో తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం తరఫున స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు
- నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సిద్ధం
- సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం తరఫున స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా, నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చర్రిత తెలిసిన ప్రముఖ వ్యక్తిగా... హైదరాబాద్లో వెంటనే స్థలం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కిషన్రెడ్డి ఆదివారం లేఖ రాశారు. స్థలం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దెదింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించడంలో ఎంతో మంది మహనీయుల పాత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. కుమ్రం భీం, పీవీ నరసింహారావు, రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి నేతల పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్య, తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబరు 17న నిజమైన స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందన్న విషయాన్ని మరవరాదని సూచించారు.