విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికుల మృతి
ABN , First Publish Date - 2020-09-01T08:09:36+05:30 IST
విద్యుత్తు లైను పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం

- పిన్నంచర్లలో పనులు చేస్తుండగా ప్రమాదం
వనపర్తి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు లైను పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచర్లలో జరిగింది. వనపర్తి జిల్లా తిరుమలయ్యపల్లి నుంచి మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి జాతర సబ్స్టేషన్ వరకు 33 కేవీ సబ్స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికులు లితిన్(27), కభుమియాన్(28), కరీం(27), అబ్దుల్ సమీర్(28) పిన్నంచర్ల గ్రామం వద్ద 33కేవీ ఏబీ స్విచ్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు వైర్ల కనెక్షన్ పూర్తిచేసి మూడో వైర్ కనెక్షన్ ఇస్తుండగా అది తెగి పక్కనే పిన్నంచర్ల గ్రామానికి విద్యుత్తు సరఫరా చేసే 11 కేవీ లైన్పై పడింది. దీంతో ఆ వైర్ గుండా కరెంటు సరఫరా జరిగి నలుగురు కార్మికులు షాక్కు గురయ్యారు. కరెంటు స్తంభాలపై ఉన్న వారు కింద పడిపోయారు. మిగతా కార్మికులు వారిని ఆస్పత్రికి తరలించగా లితిన్, కభుమియాన్ అప్పటికే చనిపోయారు. కరీం, అబ్దుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.