గల్ఫ్ కార్మికులకు ‘క్వారంటైన్’ కష్టాలు!
ABN , First Publish Date - 2020-07-08T08:53:59+05:30 IST
గల్ఫ్ కార్మికులకు ‘క్వారంటైన్’ కష్టాలు!
భారంగా మారిన ఖర్చులు
ఉచిత క్వారంటైన్కు కార్మికుల డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి గల్ఫ్ దేశాల నుంచి స్వరాష్ట్రానికి వస్తున్న కార్మికులకు క్వారంటైన్ కష్టాలు ఎదురవుతున్నాయి. క్వారంటైన్ ఖర్చు భారంగా మారుతోంది. వందే భారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో వచ్చిన వాళ్లకు టికెట్ ధర తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా వివిధ సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేస్తున్న చార్టర్డ్ విమానాల్లో వచ్చేందుకు టికెట్ ధరలు దాదాపు 80 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోందని గల్ఫ్ కార్మికులు వాపోతున్నారు. గల్ఫ్, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లు ఏడు రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో, మరో ఏడు రోజులు హోమ్క్వారంటైన్లో ఉండాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో 7 రోజులకు ఉచిత క్వారంటైన్తో పాటు రూ.8వేలు, రూ.16 వేలు చెల్లిస్తే మరో రెండు రకాల క్వారంటైన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చార్టర్డ్ విమానాల్లో వచ్చే వాళ్లు ముందుగానే తెలంగాణ పర్యాటక సంస్థకు క్వారంటైన్ ఖర్చులు మొత్తాన్ని చెల్లించాలని, ఆ రశీదును దరఖాస్తుకు జత చేస్తేనే టికెట్ ఇస్తున్నారని గల్ఫ్ కార్మికులు వాపోతున్నారు. కష్టాల్లో ఉన్న తమను స్వరాష్ట్రాలకు రప్పించేందుకు మరిన్ని విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేయించాలని లేదా నేరుగా ఇళ్లకు పంపించాలని కోరుతున్నారు. కరోనా సంక్షోభం వల్ల గల్ఫ్లో దాదాపు 30శాతం మంది తెలంగాణ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. గల్ఫ్లో మొత్తం తెలంగాణ వాళ్లు 14,90,019 మంది ఉన్నారని కేంద్ర గణాంకాల ప్రకారం తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే 3 లక్షల మంది అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. కాగా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న కార్మికులకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.