వైద్యులకు పీపీ కిట్లు, మాస్క్లు ఇవ్వాలి: హైకోర్టు
ABN , First Publish Date - 2020-04-21T21:56:09+05:30 IST
కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్లు, పీపీ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్లు, పీపీ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం హైకోర్టులో కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వానికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. కరోనా నేపథ్యంలో జన సమూహాన్ని తగ్గించడం కోసం ప్రతీ కాలనీలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కరోనా కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దీనికి ప్రతిస్పందించిన ప్రభుత్వ తరఫున న్యాయవాది.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 329 కంటైన్మైంట్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్న వైద్యులకు అన్ని వసతులు కల్పించాలంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వివరాలను మరోసారి తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది.