దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్కు భయం పట్టుకుంది: దాసోజు శ్రావణ్
ABN , First Publish Date - 2020-11-15T23:45:53+05:30 IST
మంత్రి కేటీఆర్ మరోసారి గ్రేటర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. ఇంటిపన్ను తగ్గింపు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మరోసారి గ్రేటర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. ఇంటిపన్ను తగ్గింపు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేటీఆర్ది నీచ రాజకీయమని, ప్రజలకు డబ్బులు ఎరవేసే కుట్ర చేస్తున్నారని దాసోజు శ్రావణ్ ఆరోపించారు. డాక్టర్లు, నర్సులు, పోలీస్లు కరోనా కాలంలో చాలా కష్టపడ్డారని, వారికి ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వలేదు.. జీతాలు పెంచలేదు? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తప్ప ప్రజలమీద ప్రేమ కాదని తప్పుబట్టారు. నిజంగా ప్రేముంటే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి లేదా ఉచితంగా చేయాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట మీ దోపిడీని ప్రజలు మరిచిపోరన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇంటిపన్ను, కరెంట్ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, ఆ తర్వాతనే కేటీఆర్ జీహెచ్ఎంసీలో ఓట్లు అడగాలని చెప్పారు. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్కు భయం పట్టుకుందని దాసోజు శ్రావణ్ ఎద్దేవాచేశారు.