నేటి నుంచి పట్టాలెక్కనున్న రైళ్లు
ABN , First Publish Date - 2020-06-01T08:47:54+05:30 IST
సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత సోమవారం నుంచి రైళ్లు పట్లాలెక్కనున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 9 రైళ్లు
ప్రయాణంలో మాస్కులు తప్పనిసరి.. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి
హైదరాబాద్/సికింద్రాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత సోమవారం నుంచి రైళ్లు పట్లాలెక్కనున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 9 రైళ్లు నడవనున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో రైలు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రయాణం పూర్తయ్యేవరకు మాస్కులు ధరించాలని, ఆహార పదార్థాలు, నీరు, బెడ్షీట్లు, దుప్పట్లను వెంట తెచ్చుకుంటే మంచిదని సూచించింది. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్, హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్-ముంబై హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-దానాపూర్ దానాపూర్ ఎక్స్ప్రెస్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ (వయా... సికింద్రాబాద్) రైళ్లు పట్టాలెక్కనునాయి. వీటితో పాటు సికింద్రాబాద్-నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ (వారానికి రెండు సార్లు) కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్ (వయా.. సికింద్రాబాద్) రైలు కూడా ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానుంది.
పాటించాల్సిన సూచనలు
- రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాలు ముందే స్టేషన్కు చేరుకోవాలి
- లైసెన్స్డ్ కూలీలు తక్కువగా ఉన్నందున తక్కువ లగేజీని తెచ్చుకోవాలి
- ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి
- స్ర్కీనింగ్ సమయంలో కోవిడ్-19 లక్షణాలుంటే ప్రయాణాలకు అనుమతించరు
- రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, కేన్సర్తో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, 10ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్లకు పైబడిన వృద్ధులు ప్రయాణం చేయవద్దు
- స్టేషన్ల వద్ద ఆహార పదార్థాలను అమ్మే కేంద్రాలు తెరిచి ఉంటాయి