15 నుంచి పట్టాలెక్కనున్న రైళ్లు!
ABN , First Publish Date - 2020-04-03T07:16:54+05:30 IST
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 14న లాక్డౌన్ పూర్తి కాగానే 15 నుంచి ప్రారంభమయ్యే రైళ్లకు...
విమానాల రాకపోకలూ షురూ!
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 14న లాక్డౌన్ పూర్తి కాగానే 15 నుంచి ప్రారంభమయ్యే రైళ్లకు ఆన్లైన్లో రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ 14 తర్వాత కూడా కేంద్రం లాక్డౌన్ను పొడిగిస్తే మాత్రం.. బుకింగ్ అయిన టికెట్లను రద్దు చేసుకునే అవకాశమిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 14 అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగనుంది. దాంతో 14 వరకు నడిచే రైళ్లన్నింటినీ రైల్వే శాఖ రద్దు చేసింది. ఇప్పటికే బుక్ అయిన టికెట్లను రద్దు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. 100ు మేర డబ్బును ప్రయాణికులకు వాపసు చేసింది. 14వ తేదీతో లాక్డౌన్ పూర్తి కానున్నందున... 15వ తేదీ నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని, ఈ దృష్ట్యా ఐఆర్సీటీసీ ద్వారానే ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని ఆ అధికారి తెలిపారు. ఈనెల 15 తర్వాత విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని తెలిసింది. ప్రస్తుతానికి దేశీయ విమాన ప్రయాణాలకే అనుమతిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు లేవంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా ప్రకటించారు. లాక్డౌన్ను పొడిగిస్తారని వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు.