కంటైన్‌మెంట్‌జోన్‌లు మినహా మిగిలిన ప్రాంతాల్లో కల్లుదుకాణాలు

ABN , First Publish Date - 2020-05-14T00:40:33+05:30 IST

కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన అన్నిజిల్లాల్లోనూ కల్లుదుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

కంటైన్‌మెంట్‌జోన్‌లు మినహా మిగిలిన ప్రాంతాల్లో కల్లుదుకాణాలు

హైదరాబాద్‌: కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన అన్నిజిల్లాల్లోనూ కల్లుదుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. బుధవారం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్‌ల మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో గీత కార్మికులు కల్లును భౌతిక దూరాన్ని పాటిస్తూ, లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.6837 వల్ల రాష్ట్రంలో దాదాపు 3లక్షల మంది కల్లుగీత కార్మికులకు ఉపాధి అవకాశాలు, సుమారు 40 లక్షల మందికి పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందన్నారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో వివిధ జిల్లాల్లో గీత కార్మికుల కులవృత్తిని,ఉపాధిని కొనసాగించే క్రమంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయన్నారు. 


గీత కార్మికుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ ఉన్నా గీత వృత్తిదారులు తమ వృత్తిని కొనసాగించుకోవాలని అనుమతులు ఇచ్చారన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత త్వరలోనే నీరా కేంద్రాలను ఏర్పాటుచేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గీత వృత్తిదారులను ప్రోత్సహించడానికి ఇప్పటి వరకూ 3కోట్ల 54 లక్షల తాగి, ఈత చెట్లను నాటామని అన్నారు. హరితహారంలో భాగంగా ఇంకా కోట్లాది తాటి , ఈత మొక్కలను ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ వర్షాకాలంలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-14T00:40:33+05:30 IST