వనంలో జంతువులు జనంలోకి..

ABN , First Publish Date - 2020-11-21T10:06:03+05:30 IST

అడవులు తరుగుతుండడం.. ఆహారం దొరక్కపోవడం.. కారణమేదైతేనేమి! క్రూర జంతువులు జనంలోకి వస్తున్నాయి. స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

వనంలో జంతువులు జనంలోకి..

హైనా దాడిలో మూడు మేకల మృతి

అనంతారం అడవిలో పులి సంచారం


బెజ్జూరు/మర్రిగూడ/వట్టివాగు, నవంబరు 20: అడవులు తరుగుతుండడం.. ఆహారం దొరక్కపోవడం.. కారణమేదైతేనేమి!  క్రూర జంతువులు జనంలోకి వస్తున్నాయి. స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా పులి వేటు నుంచి పశువుల కాపర్లు అదృష్టంకొద్దీ ప్రాణాలతో బయటపడగా.. మూడు మేకలను హైనా చంపేసింది. మరోచోట పులి గాండ్రింపులు వినిపించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని అంబగట్టు బీట్‌ అటవీ ప్రాంతంలోకి కుకుడ గ్రామానికి చెందిన సడ్మెక ఉపేందర్‌, కొండయ్య, మడే భీమయ్యలు  శుక్రవారం మేకలను తోలుకెళ్లారు. కొద్దిసేపటికి మేకలన్నీ బెదిరిపోవడంతో.. ఏం జరిగిందోనని చూసిన ఆ ముగ్గురికీ ముచ్చెమటలు పట్టాయి. ఎదురుగా పెద్దపులి కనిపించింది. పరుగు పరుగున ఓ చెట్టుపైకి ఎక్కారు. గట్టిగా కేకలు వేయడంతో.. పులి అడవిలోకి వెళ్లిపోయింది.


నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి గ్రామ శివారులోని పొలం వద్ద ఉన్న కొట్టంలో తొడేటి యాదయ్య గురువారం నాలుగు మేకలను వదిలి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూసేసరికి 3 మేకలు కొట్టం బయట మృతిచెంది ఉన్నాయి.  అటవీ అధికారులు.. హైనా దాడి చేసిందని ధ్రువీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం దామరతోగు అటవీ ప్రాంతంలోని గ్రామాల సమీపంలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఓ పులి కన్పించిందని.. గాండ్రిపులు విన్పిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. అయితే, తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని అనంతారం సెక్షన్‌ అటవీ అధికారి గోవింద్‌ తెలిపారు.

Updated Date - 2020-11-21T10:06:03+05:30 IST