దాశరథి సాహితీ వారసుడు రామానుజం
ABN , First Publish Date - 2020-08-16T09:32:25+05:30 IST
తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని, మహాకవి దాశరథి కృ..

- సీఎం కేసీఆర్ ప్రశంస... దాశరథి పురస్కారం అందజేత
హైదరాబాద్, యాదాద్రి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని, మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ వారసుడిగా ఆయన నిలుస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రసిద్ధ సాహితీవేత్తలకు ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్ఠాత్మకమైన దాశరఽథి పురస్కారానికిగాను ఈ ఏడాది, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన రచయిత, కవి రామానుజాన్ని ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని శనివారం ప్రగతిభవన్లో రామానుజానికి కేసీఆర్ ప్రదానం చేశారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించి, జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హులని అభిప్రాయపడ్డారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం వంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని పేర్కొన్నారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు. ఆయన మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు.
దాశరథి పురస్కార ప్రధానం సందర్భంగా తాను రచించిన ఓ పద్యాన్ని రామానుజం పాడి వినిపించారు. ఇదీ ఆ పద్యం..
అపర విష్ణుడవీవు
‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యట్టి
అపర విష్ణుడవీవు
తెలగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ కల్వకుంట్ల
క్షీరాబ్ది చంద్రమా
శ్రీ రస్తు.. శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా.. విజయోస్తు’’