వచ్చిన వారు సర్కారీ క్వారంటైన్కే
ABN , First Publish Date - 2020-05-09T10:38:51+05:30 IST
వచ్చిన వారు సర్కారీ క్వారంటైన్కే
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి) లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారు నేరుగా క్వారంటైన్కే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల్లో వలస కార్మికులు, కూలీలు కూడా ఉంటారని, వారు సొంత ఖర్చుతో హోటళ్లలో ఉండలేరని, అటువంటి వారిని సర్కారీ క్వారంటైన్ కేంద్రాలకు పంపే అంశంపై తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై నేడో, రేపో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, విదేశాల నుంచి వచ్చేవారు విమానాశ్రయాలకు చేరుకోగానే రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు చేస్తాయని, కరోనా లక్షణాలుంటే ఆసుపత్రులకు పంపిస్తాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. లక్షణాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ క్వారంటైన్కు పంపాలని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులంతా సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జీల్లో క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశాల్లోని భారతీయుల రాక కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వృద్ధులు, గర్భిణులు, తీవ్రమైన వైద్య సమస్యలు ఉన్నవారు, భారత్కు అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తదితరులకు ప్రాధాన్యమిచ్చారు. వైరస్ అనుమానిత లక్షణాలు లేనివారినే అక్కడి నుంచి ప్రయాణానికి అనుమతిస్తున్నారు. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వారం రోజుల్లో దాదాపు 2,350 మంది రానున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేశారు. మరోవైపు యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్లకు విమానాలను పంపించడానికి ఏర్పాట్లు చేశారు.