రాష్ట్రంలో ఇంకా లక్షలాది వలస కార్మికులు
ABN , First Publish Date - 2020-05-13T10:11:50+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు సురక్షితంగా తరలించాలని కార్మిక, ప్రజా, దళిత సంఘాలు,

- స్వరాష్ట్రాలకు సురక్షితంగా తరలించండి
- సీఎం కేసీఆర్కు కార్మిక, దళిత, ప్రజా సంఘాల లేఖ
హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు సురక్షితంగా తరలించాలని కార్మిక, ప్రజా, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంగళవారం రైతు స్వరాజ్య వేదిక, దళిత బహుజన ఫ్రంట్, మహిళా కిసాన్ అధికార్ మంచ్, ఎంవీ ఫౌండేషన్, హ్యూమన్ రైట్స్ ఫోరమ్, బహుజన ప్రతిఘటన వేదికతో పాటు మొత్తం 26 సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో వలస కార్మికులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా రోజుకు 40 రైళ్ల చొప్పున వారం పాటు నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5న ప్రకటించింది. అయితే రైళ్లను పూర్థిస్థాయిలో నడపలేదని వారు అన్నారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఇంతవరకు 45 రైళ్ల ద్వారా 50,822 మంది వలస కార్మికులనే ప్రభుత్వం రైళ్ల ద్వారా వారి రాష్ట్రాలకు తరలించిందన్నారు. రాష్ట్రంలో ఇంకా లక్షలాది మంది వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు నిరీక్షిస్తున్నారని, వారందరినీ రైళ్లు, బస్సుల ద్వారా సురక్షితంగా తరలించాలని సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి.