పన్నుల చెల్లింపు కూడా దేశభక్తే
ABN , First Publish Date - 2020-12-06T08:23:19+05:30 IST
పారదర్శకంగా పన్ను లు చెల్లించడం కూడా దేశభక్తే అని, ఇది దేశాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

ఆదాయ పన్ను చెల్లింపుతో అభివృద్ధి: గవర్నర్
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పారదర్శకంగా పన్ను లు చెల్లించడం కూడా దేశభక్తే అని, ఇది దేశాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజలు సక్రమంగా ఆదాయ పన్ను చెల్లిస్తే అది దేశ ప్రగతికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆన్లైన్ వేదికగా శనివారం ప్రా రంభమైన రెండు రోజుల అఖిల భారత ట్యాక్స్ ప్రాక్టీషనర్ల సమాఖ్య (ఏఐఎఫ్టీపీ) 23వ జాతీయ స్థాయి సదస్సులో రాజ్భవన్ నుంచి ఆమె ప్రసంగించారు. వివిధ రకాల పన్నులే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులని చెప్పారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) లెక్కల ప్రకారం...దేశంలోని 130 కోట్ల జనాభాలో 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని వివరించారు.
సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వినీత్ శరణ్ గౌరవ అతిథిగా, ఏఐఎఫ్టీపీ ప్రతినిధులు నిఖిత ఆర్ బదేక, శ్రీనివాసరావు, పీవీ సుబ్బారావు, ఎంవీకే మూర్తి, అశోక్ షరాఫ్ పాల్గొన్నారు.