ఎర్రకోట రహస్యం!
ABN , First Publish Date - 2020-12-15T07:40:02+05:30 IST
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన సాగిన తీరుపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన ప్రధాని నరేంద్రమోదీ,
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి
బీజేపీతో యుద్ధం లేదని సంకేతాలిచ్చినట్టేనా?
ఫామ్ హౌస్కు సీఎం.. వెళ్లి కలిసిన కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన సాగిన తీరుపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జరిపిన ఏకాంత భేటీలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
అయితే సీఎం కేసీఆర్ వారిని కలిసి రెండు రోజులు గడిచినప్పటికీ, అధిష్ఠానం వైపు నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవటం పార్టీ ముఖ్యుల్లోనూ చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ ఈనెల 11న(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై టీఆర్ఎస్ సీనియర్లు పలువురు అంతర్గత సంభాషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఆయన ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశారని ఆ వర్గాలు అనుకుంటూనే, ప్రత్యేకించి మోదీ, అమిత్షాతో జరిపిన ఏకాంత భేటీలకు రాజకీయ ప్రాధాన్యం తప్పక ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం పెద్దలను కలిసిన సమయం, సందర్భంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ గెలిచింది.
ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం మొదలవుతుందని ప్రకటించారు. దానికి తానే నాయకత్వం వహిస్తానని చెప్పారు. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యత బాగా తగ్గింది. 99 స్థానాల నుంచి 56 స్థానాలకు పడిపోయింది. బీజేపీ.. 4 నుంచి 48 స్థానాలకు ఎగబాకింది.
అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈనెల 8న దేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వగా, రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.పార్టీ యంత్రాంగంతోపాటు మంత్రులు బంద్లో పాల్గొనటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత 72 గంటల్లోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లటాన్ని టీఆర్ఎస్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
ఇది సరైన ఎత్తుగడే!!
సీఎం కేసీఆర్ ఈ సమయంలో ఢిల్లీకి వెళ్లటాన్ని టీఆర్ఎ్సకి చెందిన కొందరు ముఖ్యులు సరైన ఎత్తుగడగానే భావిస్తున్నారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో ఆధిక్యం తగ్గిన తర్వాత టీఆర్ఎ్సలో వేర్వేరు కారణాల వల్ల ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్ఠానానికీ ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఒకసారి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాక నిలువరించటం కష్టం. దానికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి. అది సీఎం కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన నెరవేర్చింది’’ అని టీఆర్ఎస్ ముఖ్యుడొకరు విశ్లేషించారు.
‘‘రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా.. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సఖ్యతగానే ఉన్నామన్న సందేశం ఇవ్వడం ద్వారా ఆ పార్టీలోకి వెళ్లాలనుకునే టీఆర్ఎస్ నేతలు తప్పక పునరాలోచనలో పడ్తారు. టీఆర్ఎ్సపై దూకుడుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నేతల్లో గందరగోళం తప్పదు. పార్టీ జాతీయ నేతలు కేసీఆర్తో బాగున్నప్పుడు, తిట్టి తామెందుకు బద్నాం కావాలనే అభిప్రాయం ఏర్పడుతుంది. వారు విమర్శలు చేసినా ప్రజలు విశ్వసించటం తగ్గిపోతుంది’’అని మరో నేత విశ్లేషించారు.