ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-12-29T06:18:43+05:30 IST

ప్రజలకు భారంగా మారిన ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం గాంధీభవన్‌లో ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గం, తెలంగాణ ప్రజల

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాల్సిందే

రేపు గాంధీభవన్‌లో  ఒక్క రోజు దీక్ష

తెలంగాణ ప్రజల పక్షాన ఈ నిర్ణయం

కరోనా కాలంలో ప్రజల వద్ద డబ్బుల్లేవు

రూ.2లక్షల చొప్పున ఎలా కడుతారు?

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు భారంగా మారిన ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలన్న డిమాండ్‌తో బుధవారం గాంధీభవన్‌లో ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గం, తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సతో లింకు తీయకపోవడం వల్ల పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని తెలిపారు.  లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతోందని, దీంతో చాలా మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లేఅవుట్‌ లేకుండానే ప్లాట్లు అమ్మేశారని తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయన్న ఆశతో వాటిని పేద, మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్నారని పేర్కొన్నారు. అలాంటి వాటికి రేటు ఫిక్స్‌ చేసి క్రమబద్ధీకరిస్తామని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.


కరోనా కాలంలో పేదల దగ్గర డబ్బుల్లేవని, ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో మళ్లీ రూ.2 లక్షల వరకూ కట్టాలంటే ఎలా? అని నిలదీశారు. కరోనా దెబ్బకు ప్రభుత్వం వద్దే డబ్బు లేదని, ఇక పేదల వద్ద ఎలా ఉంటుందని అన్నారు. ఐదారు నెలలుగా వ్యాపారాలు కుప్పకూలాయని, నిర్మాణ రంగం బంద్‌ అయిందని, కూలి పనులు సైతం దొరకడం లేదని తెలిపారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లుగానే ఎల్‌ఆర్‌ఎ్‌సనూ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ. 5వేల నుంచి రూ.10 వేల లోపు రుసుముతో ప్లాట్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కోసం గాంధీభవన్‌లో తాను చేపట్టనున్న దీక్షను సీఎల్పీ నేత భట్టి ప్రారంభిస్తారని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ విరమింపజేస్తారని వెల్లడించారు. 


కెప్టెన్‌గా ఎవరిని నిర్ణయించినా పని చేస్తం

టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్చా జరగడం లేదని జగ్గారెడ్డి అన్నారు. తాము చెప్పుకోవాల్సింది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు చెప్పేశామని, ప్రస్తుతం బంతి సోనియా, రాహుల్‌గాంధీ వద్ద ఉందన్నారు. అధిష్ఠానం వద్ద ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని, వారు ఎవరిని నియమించినా పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కెప్టెన్‌గా సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారి కింద పనిచేస్తామన్నారు. వ్యతిరేకించే.. ప్రతిపాదించే.. సమయం అయిపోయిందని  చెప్పారు. 

Updated Date - 2020-12-29T06:18:43+05:30 IST