ఇంటికే పరిమితం కావాలి

ABN , First Publish Date - 2020-03-25T10:40:13+05:30 IST

ప్రజలు ఇంటికి పరిమితమై కరోనా వైర్‌సను అరికట్టేందుకు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం

ఇంటికే పరిమితం కావాలి

మంత్రి ఎర్రబెల్లి పిలుపు

హన్మకొండ టౌన్‌, మార్చి 24: ప్రజలు ఇంటికి పరిమితమై కరోనా వైర్‌సను అరికట్టేందుకు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించింన నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని సూచించారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు క్వారంటైన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న 247 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వారందరికీ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, జిల్లా వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనా బాధితులకు కోసం ఎంజీఎంలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లా కేంద్రాల్లో సైతం ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Updated Date - 2020-03-25T10:40:13+05:30 IST