‘చింతవర్రె’ ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్
ABN , First Publish Date - 2020-12-30T07:18:33+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన చింతవర్రెలో పది రోజుల క్రితం ఓ ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థినులను లైంగిక వేదింపులకు గురి చేసిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా

నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన చింతవర్రెలో పది రోజుల క్రితం ఓ ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థినులను లైంగిక వేదింపులకు గురి చేసిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. పూర్తి విచారణ జరిపి జనవరి 5లోపు తమకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్దత్, స్ర్తీశిశు సంక్షేమశాఖ అధికారి ఆర్.వరలక్ష్మికి మంగళవారం కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాసరావు నుంచి ఉత్తర్వులు అందాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితుడికి, అతడికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ ఘటనను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు పరామర్శించి, పూర్తి వివరాలను తెలుసుకొని రావాలని మంత్రులు పువ్వాడ అజయ్ , సత్యవతి రాథోడ్, మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యలకు కేటీఆర్ సూచించినట్లు వనమా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.