మరో వందే భారత్‌ విమానం రాక

ABN , First Publish Date - 2020-05-17T09:12:40+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ తొలి విడత పూర్తయింది. ఇందులో భాగంగా 12 దేశాల....

మరో వందే భారత్‌ విమానం రాక

హైదరాబాద్‌కు చేరిన 121 మంది..


శంషాబాద్‌ రూరల్‌/న్యూఢిల్లీ, మే 16: లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ తొలి విడత పూర్తయింది. ఇందులో భాగంగా 12 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురాగా.. శనివారం అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి తెలంగాణకు చెందిన 121 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఏఐ 1839 ఎయిరిండియా విమానం వీరితో శనివారం తెల్లవారుజామున 3.14 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్‌, సీఐఎ్‌సఎఫ్‌ అధికారుల తనిఖీలు, థర్మల్‌ స్ర్కీనింగ్‌, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భౌతికదూరం పాటిస్తూ 25 మందిని ఒక గ్రూప్‌గా చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో పెయిడ్‌ క్వారంటైన్లకు తరలించారు. వందే భారత్‌ మిషన్‌ ప్రారంభమైన ఈ నెల 7 నుంచి ఇప్పటివరకు ఎనిమిది విమానాలు రాకపోకలు సాగించాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కువైత్‌, యూఏఈ, అమెరికా, యూకే, మనీలా, కౌలాలంపూర్‌ నుంచి 1200 మంది ప్రయాణికులను శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఈ విమానాశ్రయం నుంచి  అమెరికా, జర్మనీ, యూకే, కెన్యా దేశస్థులను వారి దేశాలకు పంపించినట్లు చెప్పారు. కాగా, ప్రయాణికులందరినీ 14 రోజుల క్వారంటైన్‌లో పెడుతున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా.. వందే భారత్‌ రెండో విడత ప్రారంభమైంది. ఎయిరిండియాకు చెందిన మూడు విమానాలను శనివారం దుబాయ్‌, అబుధాబికి పంపించారు.

Updated Date - 2020-05-17T09:12:40+05:30 IST