తహసీల్దార్ సుజాత భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-18T09:15:11+05:30 IST
భార్యాభర్తలు ఉన్నతోద్యోగులు.. భర్త ఉస్మానియా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. భార్య తహసీల్దార్.. మంచి వేతనాలతో హాయిగా సాగుతున్న ఆ దాంపత్య జీవితంలో ఓ కుదుపు..
- ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి అఘాయిత్యం
- భార్య అరెస్టుతో అజయ్కుమార్ మనస్తాపం
- ‘అవినీతి’లో ప్రమేయం ఉందని ఏసీబీ అనుమానం
- విచారణకు రావాలని ఆయనకు సమాచారం
- ఇంతలోనే ప్రాణం తీసుకున్న ప్రొఫెసర్
- ఏసీబీ అధికారుల వేధింపులే కారణం: బంధువులు
- బెయిల్పై విడుదలైన తహసీల్దార్ సుజాత
చిక్కడపల్లి/హైదరాబాద్ సిటీ/సైదాబాద్, జూన్17 (ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు ఉన్నతోద్యోగులు.. భర్త ఉస్మానియా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. భార్య తహసీల్దార్.. మంచి వేతనాలతో హాయిగా సాగుతున్న ఆ దాంపత్య జీవితంలో ఓ కుదుపు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భార్య అరెస్టు కావడం.. తననూ విచారణకు పిలవడంతో ఆమె భర్త కుంగిపోయారు. మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు.. ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో బుధవారం జరిగిందీ దారుణం. పోలీసులు, బాధితుడి కుటుం బ సభ్యుల వివరాల మేరకు... హైదరాబాద్లోని ముషీరాబాద్ గాంధీనగర్లో ఉంటున్న అజయ్కుమార్ (47), సుజాత దంపతులు. అజయ్కుమార్ ఓయూలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసెస్టెంట్ ఫ్రొ పెసర్గా పనిచేస్తున్నారు. సుజాత రంగారెడ్డి జిల్లా షేక్పేట మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ భూ వివాదం కేసులో షేక్పేట ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్కు ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో ఆమె ఇంట్లోనూ ఏసీబీ సోదాలు చేయగా.. రూ. 30 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు లభించాయి.
అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న కారణంతో సుజాతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని అజయ్కుమార్కూ ఏసీబీ అధికారులు సమాచారమిచ్చారు. భార్య అరెస్టు తర్వాత ఆయన.. చిక్కడపల్లిలో ఓ అపార్ట్మెంట్లోని తన సోదరి రేఖ ఇంట్లో ఉంటున్నారు. భార్య అరెస్టు కావడంతో మనస్తాపం చెందిన అజయ్కుమార్.. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఐదో అంతస్తుకు వెళ్లి.. అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, సీఐ ప్రభాకర్ సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అజయ్కుమార్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మరోవైపు.. చంచల్గూడ జైలులో ఉన్న తహసీల్డార్ సుజాత బెయిల్పై బుధవారం విడుదలయ్యారు. కాగా, ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తమ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి సోదరి గోకా మంగళ ఆరోపించారు.
ఆత్మహత్య బాధాకరం: ట్రెసా
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) త్రినిధులు విచారం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకున్నా తహసీల్దార్ను అరెస్టు చేశారని, అవమానం వల్లే ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు ఎస్.రాములు విచారం వ్యక్తం చేశారు.