‘ఐనవోలు టెండర్ల’పై కలెక్టర్ ఆరా
ABN , First Publish Date - 2020-12-30T05:25:47+05:30 IST
‘ఐనవోలు టెండర్ల’పై కలెక్టర్ ఆరా
ఐనవోలు, డిసెంబరు 29: మల్లికార్జునస్వామి జాతర టెండర్ల వివాదం... కోర్టు స్టేపై ఆంధ్రజ్యోతి టాబ్లాయిడ్లో ప్రచురితమైన ‘ఐనవోలు టెండర్లపై అయోమయం’ అనే కథనంపై కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆరా తీశారు. ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా టెండర్ల వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఈవో వివరించారు. దీంతో హైదరాబాద్కు వెళ్లి ఎండోమెంట్ కమిషనర్ను కలిసి మరోసారి సమస్యను వివరించాలని ఈవోకు కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. ఆపై వివరాలను తనకు తెలిపితే కమిషనర్తో మాట్లాడుతానని కలెక్టర్ చెప్పినట్లు సమాచారం .
దీంతో ఈవో హుటాహుటిన హైదరాబాద్ ఎండోమెంట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కమిషనర్ అనిల్కుమార్తో సమావేశమయ్యారు. కమిషనర్ వెంటనే ఆర్జేసీ రామకృష్ణ, ఈవోలతోపాటు పలువురు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి టెండర్ల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. టెండర్ల వ్యవహారంపై అతి త్వరలోనే స్పష్టత ఇస్తామని సమావేశంలో కమిషనర్ చెప్పినట్టు సమాచారం.