రక్షకుడా జయం జయం.. పాట రాసిన స్వరూపారెడ్డి
ABN , First Publish Date - 2020-04-28T14:02:10+05:30 IST
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పోలీసులు 24 గంటలూ విధుల్లో నిమగ్నమయ్యారు.

హైదరాబాద్ : కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పోలీసులు 24 గంటలూ విధుల్లో నిమగ్నమయ్యారు. రక్షకులకు జయం కలగాలని, సేవకులకు శుభం కలగాలని.. రాష్ట్ర మొదటి మహిళా గజల్ గాయని స్వరూపారెడ్డి ఆకాంక్షించారు. అనుకున్నదే తడవుగా ఓ పాట రాశారు. ధ్యావరి నరేందర్రెడ్డి కంపోజ్ చేయగా... బాజీ సంగీతాన్ని సమకూర్చగా ఆమె ఆలపించారు. ఈ పాటను సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ సజ్జనార్ సమక్షంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు అనసూయ, రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ లావణ్య, జహీరాబాద్ కౌన్సిలర్ రవికిరణ్ పాల్గొన్నారు. స్వరూపారెడ్డిని సీపీ సత్కరించారు.
స్వరూపారెడ్డి రాసిన పాట
రక్షకుడా జయం జయం.. జయం జయం..
సేవకుడా శుభం శుభం.. శుభం శుభం..
నీ ధైర్యం అచంచలం.. నీ సాయం నిరంతరం
లోకాన నీ మేలు మరువలేముగా...
నీ స్థైర్యం హిమాచలం.. నీ గమ్యం మహోదయం..
శిఖరాన నీ కీర్తి వెలుగుతోందిగా...
సమరంలో సాగుతున్న అడుగులకే తోరణాలూ...
మనసారా చేస్తున్నాం పోలీసుకు వందనాలూ..!