రెడ్, ఆరెంజ్, గ్రీన్... జోన్ ఏదైనాసరే..
ABN , First Publish Date - 2020-05-09T14:04:41+05:30 IST
లాక్డౌన్ను ఈనెల 29 వరకు పొడిగించినందున.. బస్సులను నడపొద్దని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆదేశించారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ను ఈనెల 29 వరకు పొడిగించినందున.. బస్సులను నడపొద్దని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆదేశించారు. ఆయన ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజా రవాణాకు సంబంధించి అంతర్రాష్ట్ర బస్సులు, రాష్ట్రంలో నడిచే ప్రయాణికుల బస్సులను అనుమతించకూడదని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అన్ని డిపోల అధికారులు, యూనిట్ అధికారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్... జోన్ ఏదైనా బస్సులు నడపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మూడు జోన్ల పరిధిలోని కార్యాలయాల అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని, రెడ్ జోన్లలో జూనియర్ స్కేల్ ఆఫీసర్ కంటే కింది స్థాయి సిబ్బందిలో 33 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలని తెలిపారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని వంద శాతం సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించారు. అయితే... మూడు జోన్లలోని హైరిస్కు గర్భిణులు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు, కీమోథెరపి తీసుకుంటున్న వారికి విధులు అప్పగించవద్దని సూచించారు.