‘తెలంగాణ’కు స్ఫూర్తి ఈశ్వరీబాయి
ABN , First Publish Date - 2020-02-25T09:21:05+05:30 IST
ఈశ్వరీబాయిలాంటి మహనీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ...
ఆమె ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన: శ్రీనివాస్ గౌడ్
బలహీన వర్గాల కోసం పోరాడిన వీర వనిత ఈశ్వరీబాయి: కిషన్ రెడ్డి
పలువురికి ఈశ్వరీబాయి స్మారక పురస్కారాలు ప్రదానం
రవీంద్రభారతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఈశ్వరీబాయిలాంటి మహనీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్సగౌడ్ అన్నారు. ఆమె ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని, సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతోందని చెప్పారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే గీతారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈశ్వరీబాయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి విజయభారతి తారకం, భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, సామాజికవేత్త మనీష బంగారు, కె. భారతిలకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన వీర వనిత ఈశ్వరీబాయిని ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ‘తెలంగాణ కోసం ఉద్యమించి, అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు. ఈశ్వరీబాయి కూతురు గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వాలు ఈశ్వరిబాయి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణకు సంస్కృతి నేర్పించామని చెప్పుకునేవారు ఈశ్వరీబాయి జీవితాన్ని చదవాలని సూచించారు. ఈ తరం ఆడపిల్లలకు ఈశ్వరీబాయి ఆదర్శప్రాయురాలని కేవీ రమణాచారి కొనియాడారు. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ అధినేత్రి గీతారెడ్డి మాట్లాడుతూ తన తల్లి ఈశ్వరీబాయి అణగారిన వర్గాల మహిళల గొంతుకగా నిలిచారని గుర్తుచేశారు. ఆమె జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.