‘అన్నీ బంద్.. ఆదేశాలను పట్టించుకోకుండా బయటకొచ్చారో...’

ABN , First Publish Date - 2020-03-23T18:20:20+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 1897 సెక్షన్ ప్రకారం లాక్‌డౌన్ పెట్టామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వద్ద సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే అనుమతి ఇచ్చామని చెప్పారు.

‘అన్నీ బంద్.. ఆదేశాలను పట్టించుకోకుండా బయటకొచ్చారో...’

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 1897 సెక్షన్ ప్రకారం లాక్‌డౌన్ పెట్టామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వద్ద సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే అనుమతి ఇచ్చామని చెప్పారు. రవాణా సేవలన్నింటినీ బంద్ చేశామన్నారు. అత్యవసర సామాగ్రికి సంబంధించిన వాటికి మినహాయింపు ఇచ్చామన్నారు. లాక్‌డౌన్‌‌ను ప్రజలు పట్టించుకోని నేపథ్యంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎస్.. రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. ఐదుగురు మించి రోడ్లపై ఎవరూ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రోడ్డు మీదకు ఏ ఒక్క వాహనం వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయిలో కరోనా ప్రభావం అంత తీవ్రంగా లేదని, అయినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోక తప్పదని సీఎస్ తెలిపారు. ఎన్ఆర్‌డీఎస్ తమ విధులు కొనసాగిస్తారని సోమేశ్ కుమార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. ఎన్ఆర్ఐ లు ప్రభుత్వ సూచనలను అతిక్రమిస్తే పాస్‌పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మెడికల్ ఎమర్జెన్సీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Updated Date - 2020-03-23T18:20:20+05:30 IST