పోలీసు భయంతో బావిలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-04-28T10:03:16+05:30 IST
పుట్టిన రోజున స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. తాటి కల్లు తాగేందుకు వెళ్లిన తమను పోలీసులు దండిస్తారనే భయంతో పరుగెత్తి

ఇల్లందకుంట, ఏప్రిల్ 27: పుట్టిన రోజున స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. తాటి కల్లు తాగేందుకు వెళ్లిన తమను పోలీసులు దండిస్తారనే భయంతో పరుగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయాడు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఆడెపు రాజగోపాల్(23) తన పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి కల్లు తాగేందుకు మల్యాల వెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీస్ వాహనాన్ని వారు గమనించారు. పోలీసుల కంటపడితే కేసు పెడతారేమోననే భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు. ఈక్రమంలో రాజగోపాల్ ప్రమాదవశాత్తు బావిలోపడి మృతి చెందాడు. పుట్టిన రోజు నాడే రాజగోపాల్ మృత్యువాత పడటం పలువురిని కలిచి వేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.