ఆరో విడత హరితహారం.. లక్ష్యం 30 కోట్ల మొక్కలు
ABN , First Publish Date - 2020-06-21T09:50:11+05:30 IST
ఆరో విడత హరితహారం లక్ష్యాన్ని 20 కోట్ల నుంచి 30 కోట్ల మొక్కలకు పెంచినట్లు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి
![ఆరో విడత హరితహారం.. లక్ష్యం 30 కోట్ల మొక్కలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ శోభ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఆరో విడత హరితహారం లక్ష్యాన్ని 20 కోట్ల నుంచి 30 కోట్ల మొక్కలకు పెంచినట్లు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్లు, జీహెచ్ఎంసీలో 2.50 కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో మరో 5 కోట్ల మొక్కలను అదనంగా నాటాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హరితహారం సన్నద్ధతపై జిల్లాల అటవీ శాఖ అధికారులతో శనివారం ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా అటవీ ప్రణాళికలు, హరితహారం పురోగతిపై హ్యాండ్బుక్ను సిద్ధం చేయాలని నిర్దేశించారు.
అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన కార్యదర్శి
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అసెంబ్లీ ఆవరణలో శనివారం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ను అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు స్వీకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అబ్రహాంలను గ్రీన్ చాలెంజ్లో పాల్గొనాలని నరసింహాచార్యులు నామినేట్ చేశారు.