టీ-సాట్‌ ద్వారా టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షపై అవగాహనా పాఠ్యాంశం

ABN , First Publish Date - 2020-07-19T22:43:09+05:30 IST

టీఎస్‌ ఆర్జేసీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించేందుకు తెలంగాణ విద్యార్దుల కోసం ప్రత్యేక అవగాహనా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నట్టు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానెళ్ల సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు.

టీ-సాట్‌ ద్వారా టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షపై అవగాహనా పాఠ్యాంశం

హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్జేసీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించేందుకు తెలంగాణ విద్యార్దుల కోసం ప్రత్యేక అవగాహనా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నట్టు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానెళ్ల సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి టీ-సాట్‌నెట్‌వర్క్‌ చానెళ్లు నిపుణ, విద్యాచానళ్ళలో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ప్రసారాలు ఉంటాయని తెలిపారు. ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ జూనియర్‌కాలేజీల ప్రవేశ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల కోసం ప్రత్యేక ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు. ప్రవేశ పరీక్ష ఐదు సబ్జెక్టులు ఇంగ్లీష్‌, మ్యాధ్స్‌, ఫిజికల్‌సైన్స్‌, బయాలజీ, సొషల్‌స్టడీస్‌ సబ్జెక్టుల ఆధారంగా నాలుగు గ్రూపులు ఎంపిసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నామని అన్నారు. 


ఒక్కో సబ్జెక్టుపై 10గంటల చొప్పున ఐదు సబ్జెక్టులకు సంబంధించి 50గంటల ప్రసారాలు రోజూ రెండు గంటల చొప్పున 25 రోజులు ఉంటాయని తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి నిపుణ ఛానెల్‌లో ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు, అవే పాఠ్యాంశాలను తిరిగి సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు విద్యాచానెల్‌లో ప్రసారమవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రసారాలను విద్యార్దులు అనుసరించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శైలేష్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2020-07-19T22:43:09+05:30 IST