హోంకు చేరకుండా.. హోం క్వారంటైన్‌ ఎలా?

ABN , First Publish Date - 2020-03-23T09:37:43+05:30 IST

హోం క్వారంటైన్‌.. కరోనా వైరస్‌ అనుమానితులకు ఇప్పుడీ స్టాంప్‌ ఓ పీడకల! ప్రధానంగా విదేశాల నుంచి శంషాబాద్‌కు వస్తున్న వారి బాధలు వర్ణనాతీతం. ఈ ముద్ర ఉందంటే చాలు నేరస్థులుగా

హోంకు చేరకుండా.. హోం క్వారంటైన్‌ ఎలా?

స్టాంపులతో అనుమానితుల అవస్థలు

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి  పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేని దైన్యం

ఏపీ, కర్ణాటక, ఛత్తీసగఢ్‌ వాసుల ఇక్కట్లు

ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించాలంటున్న అనుమానితులు


(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రజ్యోతి)

హోం క్వారంటైన్‌.. కరోనా వైరస్‌ అనుమానితులకు ఇప్పుడీ స్టాంప్‌ ఓ పీడకల! ప్రధానంగా విదేశాల నుంచి శంషాబాద్‌కు వస్తున్న వారి బాధలు వర్ణనాతీతం. ఈ ముద్ర ఉందంటే చాలు నేరస్థులుగా పరిగణిస్తున్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విదేశాల నుంచి వచ్చి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లాలంటే శంషాబాద్‌ విమానాశ్రయమే కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడే దిగుతుంటారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా వైరస్‌ ఉంటే అటు నుంచి అటే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. మిగతావారిని ముందు జాగ్రత్తగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తూ స్టాంప్‌ వేస్తున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం అనుమానితులు పలు ఇబ్బందులు పడ్డారు.


హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నవారు మాత్రం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెళ్లిపోగలిగారు. అలా కాకుండా తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మాత్రం అవస్థలు పడ్డారు. బస్సులు, రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాలు లేక రైల్వేస్టేషన్లు, బస్‌స్టాఫుల వద్దే ఉండిపోయారు. చేతిపై ముద్రలు గుర్తించి  స్థానికులు కొందరు పోలీసులకు ఫోన్‌ చేసి పట్టించారు. చేతులపై ముద్ర ఉండి రోడ్లపై కనపడితే 104కి ఫోన్‌ చేయాలంటూ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టు నుంచే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఉంటే తమకీ పరిస్థితి ఎదురయ్యేది కాదని అనుమానితులు వాపోయారు. లేదంటే హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌ చేసి.. అనంతరం వెళ్లేందుకు అనుమతిస్తే బాగుండేదన్నారు. తమకు ఎలాంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయకుండా రోడ్డుపై దోషులుగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తత పాటించాలని ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2020-03-23T09:37:43+05:30 IST