హక్కులను కాలరాస్తున్న కేంద్రం: సురవరం
ABN , First Publish Date - 2020-12-19T07:53:47+05:30 IST
పార్లమెంట్లో మెజారిటీ ఉందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్/కవాడిగూడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్లో మెజారిటీ ఉందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడారు.
ఢిల్లీలో విపరీతమైన చలిలో పోరాటం చేస్తున్న రైతన్నల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుజాబితాను ఇంటి నంబర్ ఆధారంగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చాడ లేఖ రాశారు.