కరోనా ఉందని చెప్పి అడ్డంగా దోచేశారు!
ABN , First Publish Date - 2020-12-15T09:05:45+05:30 IST
నకిలీ ధ్రువ పత్రాలతో ఆస్పత్రి నడుపుతూ.. డబ్బు కోసం తెలిసీతెలియని వైద్యం చేసి తన భర్త ప్రాణాలతో చెలగాటమాడి, ఆయన మరణానికి కారణమైన ఓ

హెఆర్సీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
మంగళ్హాట్, డిసెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): నకిలీ ధ్రువ పత్రాలతో ఆస్పత్రి నడుపుతూ.. డబ్బు కోసం తెలిసీతెలియని వైద్యం చేసి తన భర్త ప్రాణాలతో చెలగాటమాడి, ఆయన మరణానికి కారణమైన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని ఓ బాధితురాలు సోమవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
జనగాం జిల్లా చిల్పూరు మండలం నఖ్కల్కు చెందిన పాశం లక్ష్మయ్య (45) అస్వస్థతకు గురవడంతో ఆగస్టు 19న ఎల్బీనగర్ కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రూ. 1.70 లక్షలు కట్టించుకున్న తర్వాతే ఆసుపత్రి సిబ్బంది అడ్మిషన్ ఇచ్చారు.
రెండో రోజు వచ్చి పరీక్షించిన ఆస్పత్రి యజమాని విజయ్ గౌడ్.. రోగికి కరోనా సోకిందని చెప్పి 15 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని, ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయని భయపెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగా ఉందంటూ మూడు విడతల్లో మొత్తం 14 లక్షలు కట్టించుకున్నారని బాధితురాలు తెలిపారు. చివరి విడత డబ్బులు కట్టిన రోజే.. వైద్యులు.. తన భర్త చనిపోయారని చెప్పి మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు.