మాంసం దుకాణాల తనిఖీ- 8 దుకాణాల మూసివేత
ABN , First Publish Date - 2020-04-26T23:20:00+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని ఉన్నతాధికారుల బృందం మూసి వేయించారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని ఉన్నతాధికారుల బృందం మూసి వేయించారు. జంటనగరగాల్లో అధికశాతం మంది మాంసం విక్రేతలు అధిక ధరలు వసూలు చేస్తే కొనుగోలు దారులను దోచుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈమేరకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఆదివారం పశుసంవర్ధకశాఖకు చెందిన ఐదుగురు అధికారుల కమిటీ పలు మాంసం దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ బాబు బెర్రి కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో డాక్టర్లు సింహారావు, ఖాద్రి, భాస్కర్రెడ్డి ఉన్నారు. ముందుగా పోలీసు సిబ్బందితో కలిసి చెంగిచెర్ల స్లాటర్హౌస్, వెస్ట్మారేడ్పల్లి, కంటోన్మెంట్, ఉప్పల్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లోని 20కి పైగా మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్బంగా లైసెన్స్లేని, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 8 దుకాణాలను మూసి వేయించారు. కరోనా నేపధ్యంలో కనీస దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.