నూతన ఖైదీల కోసం ప్రత్యేక జైళ్లు
ABN , First Publish Date - 2020-07-06T11:22:54+05:30 IST
రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో ప్రస్తుతం ఉన్న ఖైదీలకు కొత్తగా శిక్షలు పడి వచ్చే వారి ద్వారా కరోనా వైరస్ సోకకుండా జైళ్ళ శాఖ
కరోనా నేపథ్యంలో జైళ్లశాఖ చర్యలు
హన్మకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో ప్రస్తుతం ఉన్న ఖైదీలకు కొత్తగా శిక్షలు పడి వచ్చే వారి ద్వారా కరోనా వైరస్ సోకకుండా జైళ్ళ శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్త ఖైదీలను పాతవారితో కలిపి ఉంచకుండా తీసుకోవలసిన చర్యలపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఖైదీలను జైళ్ళలో ప్రస్తుతం ఉన్న పాత ఖైదీలతో పాటు ఉంచినట్లయితే ఆ ఖైదీలతో పాటు జైలు సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని, అందుకని వారిని విడిగా ఉంచేందుకు ఒక కార్యాచరణను రూపొందించారిని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త ఖైదీల కోసం కొన్ని జైళ్ళను ఎంపిక చేశారు.
పూర్వ వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా శిక్షలు పడిన పురుష ఖైదీలందరినీ ఇక నుంచి మహబూబాబాద్ సబ్జైల్లో ఉంచుతారు. 100 మంది ఖైదీలను ఉంచే సామర్ధ్యం ఈ సబ్ జైలులో ఉంది. వరంగల్ జిల్లా సబ్ జైలు అధికారి మహబూబాబాద్ సబ్జైలుకు పర్యవేక్షణాధికారిగా ఉంటారు. కొత్త ఖైదీలు ఈ సబ్ జైలులో ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లును చేయనున్నారు. వరంగల్, కరీంనగర్ పూర్వ జిల్లాలకు చెందిన కొత్త మహిళా ఖైదీలను ఇక నుంచి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచుతారు. జనగామ, పరకాల సబ్జైళ్ళకు చెందిన కొత్త మహిళా ఖైదీలను కూడా వరంగల్ సెంట్రల్ జైలుకు పంపుతారు.