సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2020-10-04T08:05:25+05:30 IST
ఈ నెల 4న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2020’కు హాజరయ్యే అభ్యర్థుల..
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 4న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2020’కు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్ధం గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే సిటీ బస్సులు 730, శివార్లలో మరో 200 వరకు బస్సులు నడుస్తున్నట్లు పేర్కొంది. అయితే, ప్రతి ఆదివారం అంత సంఖ్యలో బస్సులను నడపడంలేదని, 4వ తేదీ ఆదివారం సివిల్ సర్వీసెస్ పరీక్ష ఉండడంతో అభ్యర్థుల కోసం రోజూ నడిచే 930కి పైగా బస్సులను యథాతథంగా నడుపుతామని వివరించింది.
ఉదయం వివిధ పరీక్షా కేంద్రాల వరకు, పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థుల తిరుగు ప్రయాణం కోసం ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. అభ్యర్థులకు అవసరమైన సమాచారమిచ్చేందుకు ముఖ్యమైన బస్టాపులలో సూపర్వైజర్లను నియమించినట్లు పేర్కొంది. 6 జీపుల్లో తనిఖీ బృందాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బస్సులను సమన్వయం చేస్తాయని తెలిపింది. అభ్యర్థుల సౌకర్యార్థం కోఠి(ఫోన్ నెంబర్ 9959226160), రేతిఫైల్(9959226154)లలో రెండు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.