సోషల్ వీడియో
ABN , First Publish Date - 2020-11-03T07:39:57+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసినా సోషల్ మీడియాలో మాత్రం జోరు కొనసాగుతోంది. ప్రధాన
ప్రచారం ముగిసినా వైరల్ చేస్తున్న పార్టీలు
పార్టీలవారీగా పోటా పోటీ పోస్టింగులు
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగిసినా సోషల్ మీడియాలో మాత్రం జోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మద్దతుదారులు విస్తృతంగా పోస్టింగులు పెడుతున్నారు. తమ పార్టీ ఘనతలు వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫేస్బుక్, ట్విటర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రత్యేకంగా ఖాతాలు, పేజీలను ప్రారంభించి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మాట తీరును ఎద్దేవా చేస్తూ... అసెంబ్లీలో ఆమె ఏం మాట్లాడగలుగుతారని బీజేపీ మద్దతుదారులు పలు వీడియోలను వైరల్ చేస్తున్నారు. దెబ్బ తగలకపోయినా చేతికి కట్టు కట్టుకుని సానుభూతి పొందాలని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చూస్తున్నారంటూ గాయం ఉన్నా చేతిని బాగా కదిలిస్తూ ఆయన మాట్లాడుతున్న వీడియోను టీఆర్ఎస్ మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు.
భగీరథ ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ను ప్రధాని మోదీ పొగిడిన వీడియోను టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రచారం చేస్తుంటే.. బీజేపీ ప్రచారానికి జనాలు రావడం లేదని టీఆర్ఎస్ వీడియోలు, ఫొటోలు పెడుతోంది. రఘునందన్ రావు బంధువు ఇంట్లో దొరికిన డబ్బుల గురించి టీఆర్ఎస్, ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ పంచిన డబ్బుల గురించి ఇరు పార్టీల మద్దతుదారులు వీడియోలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ యుద్ధం ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఓటర్లను కలవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాను అంతగా ఉపయోగించుకోవట్లేదు. కాకపోతే, ప్రభుత్వాన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ పోస్టింగ్లు పెట్టడం ద్వారా ఉనికినైతే బలంగానే చాటుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారం క్షేత్రస్థాయిలో దుబ్బాకకే పరిమితమైంది. కానీ, సోషల్ మీడియా వేదికగా ఖండాంతరాలు దాటుతోంది. పలు పార్టీలకు మద్దతుగా ప్రవాస తెలంగాణీయులు కూడా ప్రచారం చేస్తున్నారు.