అడుగంటిన సింగూరు
ABN , First Publish Date - 2020-05-24T07:58:21+05:30 IST
ఒకప్పుడు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలకు తాగునీరు అందించిన సింగూరు ప్రాజెక్టులో ఇప్పుడు నీళ్లు లేక ...

సంగారెడ్డి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలకు తాగునీరు అందించిన సింగూరు ప్రాజెక్టులో ఇప్పుడు నీళ్లు లేక అడుగంటిపోయింది. రెండేళ్లుగా ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా రాకపోవడంతో నీటి మట్టం కనిష్ఠ స్థాయి కన్నా దిగువకు పడిపోయింది. 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న సింగూరు ప్రాజెక్టులో 2017 అక్టోబరు నాటికి 29.50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. అయితే, అప్పట్లో ఎస్సారెస్పీలో నీళ్లు లేక సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అదే యేడు నవంబరులో సింగూరు ప్రాజెక్టు నుంచి 14 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించారు. ఆ తర్వాత 2018, 2019లో వర్షాలు పడకపోగా, కర్ణాటక-మహారాష్ట్ర నుంచి మంజీరకు చుక్క నీరు కూడా రాలేదు. అప్పట్లో ఎస్సారెస్పీకి తరలించగా మిగిలిన 15 టీఎంసీల నీటిని ఇప్పటి వరకూ తాగునీటి అవసరాల కోసం వినియోగించారు. ఇప్పుడు సింగూరులో నీటి మట్టం కనిష్ఠ స్థాయి కన్నా దిగువకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.60 టీఎంసీల నీళ్లే ఉండడంతో అక్కడక్కడ మట్టి దిబ్బలు తేలాయి.