విద్యుత్‌ పొదుపులో జీడబ్ల్యూఎంసీకి సిల్వర్‌ మెడల్‌

ABN , First Publish Date - 2020-12-20T04:13:55+05:30 IST

విద్యుత్‌ పొదుపులో జీడబ్ల్యూఎంసీకి సిల్వర్‌ మెడల్‌

విద్యుత్‌ పొదుపులో జీడబ్ల్యూఎంసీకి సిల్వర్‌ మెడల్‌
మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుకు అభినందనలు తెలుపుతున్న కార్పొరేటర్లు

అవార్డ్డు ప్రకటించిన ‘టీఎస్‌ రెడ్కో’

నేడు హైదరాబాద్‌లో అందుకోనున్న మేయర్‌ ప్రకాశ్‌రావు


వరంగల్‌ సిటీ, డిసెంబరు 19: తెలంగాణ స్టేట్‌ రెనివేబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ రెడ్కో) తరపున జీడబ్ల్యూఎంసీకి విద్యుత్‌ పొదుపులో సిల్వర్‌ మెడల్‌ను ప్రకటించారు. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జరిగిన పోటీల్లో స్థానిక సంస్థల విభాగంలో ఈ అవార్డు లభించింది. ఈమేరకు శనివారం ‘రెడ్కో’ అధికారకంగా ప్రకటించింది. రామగుండం కార్పొరేషన్‌కు గోల్డ్‌ అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి చేతులమీదుగా అవార్డును మేయర్‌ ప్రకాశ్‌రావు అందుకోనున్నారు. 

ఈ వివరాలను గుండా ప్రకాశ్‌రావు శనివారం వెల్లడించారు. గతంలో నగరంలోని వీధిదీపాలకు సోడియం వేపర్‌ మెర్క్యూరీ దీపాలను అమర్చేవారమని తెలిపారు. ఇందుకు రూ.86లక్షల వరకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు జరిగేవన్నారు. వీటిస్థానంలో ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ బిల్లులు తగ్గాయని తెలిపారు. కాగా, అవార్డు రావడంపై మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుకు కార్పొరేటర్లు వీర భిక్షపతి, లాదెళ్ల బాలయ్య, చింతల యాదగిరి, బోడ డిన్నా, జోరిక రమేష్‌, రాజు నాయక్‌ అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-12-20T04:13:55+05:30 IST