సెక్యూరిటీ బాండ్‌ ఇస్తే.. సీజ్‌ చేసిన వాహనాలు వెనక్కి

ABN , First Publish Date - 2020-05-09T09:53:38+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్‌ చేస్తూ వచ్చిన పోలీసులు.. ఇక వాటిని యజమానులకు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో గడిచిన 45 రోజుల్లో 1.5 లక్షల వాహనాలు సీజ్‌ అయ్యాయి

సెక్యూరిటీ బాండ్‌ ఇస్తే.. సీజ్‌ చేసిన వాహనాలు వెనక్కి

  • ద్విచక్ర/త్రిచక్ర వాహనాలకు రూ. 1000
  • కార్లు, భారీ వాహనాలకు రూ. 2000
  • కేసులుంటాయి.. కోర్టుల్లోనే చర్యలు


హైదరాబాద్‌ సిటీ మే 8 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్‌ చేస్తూ వచ్చిన పోలీసులు.. ఇక వాటిని యజమానులకు అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో గడిచిన 45 రోజుల్లో 1.5 లక్షల వాహనాలు సీజ్‌ అయ్యాయి. వీటిని భద్రపర్చేందుకు పార్కింగ్‌ సౌకర్యాలు లేకపోవడం.. ప్రైవేటు స్థలాల్లో వాటిని పెట్టినా.. భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో.. వాహనాలను తిరిగి ఇచ్చేయాలని పోలీసులు నిర్ణయించారు. అంతేకాదు.. వీటన్నింటినీ కోర్టుకు తరలించడం కూడా పోలీసులకు పెద్ద సవాలే. దీంతో.. ‘‘లాక్‌డౌన్‌ ఉల్లంఘనల కేసులు నమోదు చేయండి. వాహనదారుల నుంచి సెక్యూరిటీ బాండ్లు తీసుకుని, వాటిని తిరిగి ఇచ్చేయండి’’ అని డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి శుక్రవారం పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు రూ. 1000, కార్లు, ఇతర భారీ వాహనాలకు రూ. 2000 చొప్పున సెక్యూరిటీ బాండ్లు సమర్పించాలి. వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాల జిరాక్స్‌ కాపీలు, వాహన యజమాని ఆధార్‌ జిరాక్స్‌ కాపీని అందజేయాలి. సంబంధిత కేసులు కోర్టులో తేలాల్సి ఉన్నందున.. ‘‘ఎప్పుడు పిలిచినా.. వాహనాలను కోర్టుకు తీసుకుని వస్తాం’’ అని డిక్లరేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-09T09:53:38+05:30 IST