బీజేపీ, మజ్లిస్‌పై చర్యలు తీసుకోరేం?: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-11-27T07:50:26+05:30 IST

బీజేపీ, మజ్లిస్‌ పార్టీల నేతలు సమాజాన్ని చీల్చే విధంగా మాట్లాడుతున్నా, వారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర

బీజేపీ, మజ్లిస్‌పై చర్యలు తీసుకోరేం?: ఉత్తమ్‌

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, మజ్లిస్‌ పార్టీల నేతలు సమాజాన్ని చీల్చే విధంగా మాట్లాడుతున్నా, వారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సమాజాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? అన్న అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.


గాంధీభవన్‌లో గురువారం‘ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు’ అంశంపై రూపొందించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్‌ మా ట్లాడుతూ పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లను కూల్చివేయాలంటూ మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లాభం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, మజ్లిస్‌ కుట్రను హైదరాబాద్‌ ప్రజలు గమనించాలని కోరారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కౌన్సిలర్‌ స్థాయిలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 



బీజేపీ, మజ్లిస్‌వి దొంగ నాటకాలు

బంజారాహిల్స్‌: బీజేపీ, మజ్లిస్‌ దొంగ నాటకాలాడుతున్నాయని ఉత్తమ్‌ విమర్శించారు. బంజారాహిల్స్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఆ రెండు పార్టీలు విష పూరిత ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

ఒవైసీ సోదరులు వైఎ్‌సను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ సమాన న్యాయం చేసిందని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


Updated Date - 2020-11-27T07:50:26+05:30 IST