ప్రాణం తీసిన రక్తం కొరత

ABN , First Publish Date - 2020-02-12T09:01:01+05:30 IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర రక్తస్రావంతో ఓ బాలింత మృతి చెందింది. మంగళవారం బాబుకు జన్మనివ్వగానే మహిళకు తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రిలో బాధితురాలి

ప్రాణం తీసిన రక్తం కొరత

గజ్వేల్‌ ఆస్పత్రిలో  రక్తస్రావంతో బాలింత మృతి

నవజాత శిశువు క్షేమం బంధువుల ఆందోళన

రక్తస్రావంతో బాలింత మృతి

గజ్వేల్‌, ఫిబ్రవరి 11: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర రక్తస్రావంతో ఓ బాలింత మృతి చెందింది. మంగళవారం బాబుకు జన్మనివ్వగానే మహిళకు తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రిలో బాధితురాలి బ్లడ్‌ గ్రూప్‌ అందుబాటులో లేకపోవడంతో వెంటనే రక్తం ఎక్కించలేకపోయారు. దీంతో ఆమె రక్తహీనతకు గురై ప్రాణాలు కోల్పోయింది. బాధితులు తెలిపిన వివరాలు.. వర్గల్‌ మండలం జబ్బాపూర్‌కు చెందిన అనిత(20)కు మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన సాయిరాజుతో 11 నెలల క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన అనిత ప్రసవం కోసం తల్లిగారి గ్రామమైన జబ్బాపూర్‌కు వచ్చింది. సోమవారం రాత్రి 8 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనితకు శస్త్రచికిత్స చేయగా బాబు జన్మించాడు. అయితే, అదే సమయంలో అనితకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె బ్లడ్‌గ్రూప్‌ అందుబాటులో లేకపోవడంతో రక్తహీనత ఏర్పడిందని వైద్యులు తెలిపారు.


వెంటనే మెడిసిటీ ఆస్పత్రికి తరలించాలన్న వైద్యుల సూచన మేరకు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రికి వచ్చేలోపే అనిత మృతి చెందిందని మెడిసిటీ వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న అనిత బంధువు లు, కుటుంబ సభ్యులు గజ్వేల్‌ ఆస్పత్రికి తరలివచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనిత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక వైద్యులు చేసే పోస్టుమార్టంపై తమకు నమ్మకం లేదని పోలీసులకు తెలపడంతో సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో అనిత మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన త ర్వాత పూర్తిస్థాయి వివరాలు తెలుస్తాయని సీఐ ఆంజనేయులు తెలిపారు.

Updated Date - 2020-02-12T09:01:01+05:30 IST