పాపం పసివాడు!

ABN , First Publish Date - 2020-10-27T08:58:41+05:30 IST

ఇటీవల కిడ్నాపర్‌ ఘాతుకానికి బలైన బాలుడు దీక్షిత్‌ తరహాలోనే మరో చిన్నారి ప్రాణాలు పోయాయి. ఎప్పటికైనా ప్రాణాలతో తిరిగొస్తాడని

పాపం పసివాడు!

15న ఆటలో ప్రమాదం బాలుడికి తీవ్ర గాయం

భయంతో బ్యాగులో కుక్కి .. పొదల్లో విసిరివేత 

పై ఇంట్లో అద్దెకున్న బిహారీ వలసకూలీ దుర్మార్గం 

వారం తర్వాత పేరెంట్స్‌కు ఫోన్‌.. డబ్బు డిమాండ్‌ 

ఫోన్‌ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు


శామీర్‌పేట రూరల్‌, అక్టోబరు 26: ఇటీవల కిడ్నాపర్‌ ఘాతుకానికి బలైన బాలుడు దీక్షిత్‌ తరహాలోనే మరో చిన్నారి ప్రాణాలు పోయాయి. ఎప్పటికైనా ప్రాణాలతో తిరిగొస్తాడని ఆశతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. బాలుడి కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి పై పోర్షన్‌లో  అద్దెకుంటున్న బిహార్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడే నిందితుడని పోలీసులు గుర్తించారు.  కేసు వివరాలను పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ నరసింహారావు  వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో అద్దెకు ఉంటున్న సయ్యద్‌ యూసుఫ్‌, గౌసియాబేగం దంపతుల ఐదుగురు పిల్లల్లో అధియాన్‌ మూడో సంతానం. బిహార్‌కు చెందిన ఓ బాలుడు (17), తన స్నేహితుడు రాజుతో కలిసి యూసుఫ్‌ కుటుంబం ఉంటున్న ఇంట్లోని పై పోర్షన్‌లో ఈనెల 8న అద్దెకు దిగాడు. అక్కడే ఓ చోట కూలి పనికి కుదిరాడు. 


ఆ బిహార్‌ బాలుడు, అధియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. షేర్‌చాట్‌లో బాలుడితో వీడియోలు తీసేవాడు. ఈనెల 15న మధ్యాహ్నం అధియాన్‌ను ఇంటిపైకి తీసుకెళ్లి జంపింగ్‌ వీడియో తీస్తుండగా తలకు దెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది బాలుడి తల్లిదండ్రులకు తెలిస్తే తనను చంపేస్తారనే ఆందోళనతో తన దగ్గర ఉన్న టేపును అధియాన్‌ ముఖానికి, శరీర భాగాలకు చుట్టి బ్యాగులో కుక్కాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ బ్యాగును భుజాన వేసుకుని శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌ రింగ్‌రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లి చెట్ల పొదల్లో, బండ రాళ్ల మధ్యన బాలుడిని పడేశాడు. మళ్లీ తన బ్యాగును తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈనెల 23న  యూసుఫ్‌ కుటుంబం ఉంటున్న ఇంటి యజమానికి ఫోనొచ్చింది. చేసింది అధియాన్‌ను అపహరించిన 17 ఏళ్ల బాలుడే. బాబు ప్రాణాలతో కావాలంటే రాత్రి వరకు రూ.15లక్షలు డబ్బులు ఇవ్వాలని, లేదంటే బాబును చంపేస్తామని హెచ్చరించాడు. అధియాన్‌ తండ్రి ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలన్నాడు. ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.


ఆ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు, అతడి స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. జంపింగ్‌ వీడియోలో అధియాన్‌ గాయపడింది మొదలు .. పొదల్లో బాలుడిని పడేసేదాకా ఘటననంతా నిందితుడు వివరించాడు. ఘటన జరిగి పదిరోజులు కావడంతో బాలుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. కుళ్లిపోయిన మృతదేహానికి ఘటనాస్థలంలోనే ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా తమ బాబు ఆచూకీ కోసం ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, అంతకుముందు ఈనెల 15నే అధియాన్‌ ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్లి కనిపించకుండా పోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2020-10-27T08:58:41+05:30 IST