గతంలో కూల్చినా.. సెప్టిక్ ట్యాంక్ ఆక్రమించి నిర్మాణం!
ABN , First Publish Date - 2020-09-24T12:04:26+05:30 IST
ఫతేనగర్ జింకలవాడ నాలా బ్రిడ్జి పక్కనే సెప్టిక్ ట్యాంకును ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు.
హైదరాబాద్/ఫతేనగర్ : ఫతేనగర్ జింకలవాడ నాలా బ్రిడ్జి పక్కనే సెప్టిక్ ట్యాంకును ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఏడాది మార్చి 2న స్థానికుడైన ఒకరు ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన బాలానగర్ తహసీల్దార్ గౌరీవత్సల సిబ్బందిని పంపించి, పనులు ఆపివేయించారు. ఇక్కడ నిర్మాణాలు చేపడతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, లాక్డౌన్ కారణంగా కొంత కాలం నిర్మాణాన్ని పట్టించుకోని నిర్మాణదారుడు తాజాగా సెప్టిక్ ట్యాంక్ను ఆక్రమించి, దర్జాగా పిల్లర్ల నిర్మాణం మొదలు పెట్టాడు. జింకలవాడకు చెందిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ 40 గజాల స్థలం ఉందని పత్రాలు చూపించిన నిర్మాణదారుడు ఇప్పుడు, 90 గజాల పైన స్థలం ఉండంటూ సెప్టిక్ ట్యాంకు, నాలాలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.