‘సెమిస్టర్లు ఎలా రాయాలి..?’
ABN , First Publish Date - 2020-09-16T11:57:53+05:30 IST
డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సుల చివరి సెమిస్టర్లు రాసే విద్యార్థులు హాస్టళల్లో ఉండేందుకు అనుమతివ్వాలని వేడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సుల చివరి సెమిస్టర్లు రాసే విద్యార్థులు హాస్టళల్లో ఉండేందుకు అనుమతివ్వాలని వేడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం నగరంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండగా, కొవిడ్ నేపథ్యంలో వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. యూజీ, పీజీ విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో విద్యార్థులు పరీక్షల నిమిత్తం హాస్టళ్లకు వస్తే వార్డెన్లు, అధికారులు అనుమతించడం లేదు. నగరంలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల కళాశాలల హాస్టళ్ల వద్ద మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులను వేడుకున్నా అనుమతించలేదు. విషయాన్ని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ విద్యార్థులు హాస్టళ్లలో ఉండి సెమిస్టర్లు రాసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.