పార దర్శకంగా ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక
ABN , First Publish Date - 2020-09-18T10:14:26+05:30 IST
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,

- అధికారులకు మంత్రులు కేటీఆర్, వేముల ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొనసాగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలపై మంత్రులిద్దరూ ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, అవి త్వరలో పూర్తవుతాయని అధికారులు వివరించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, గృహ నిర్మాణ శాఖ మార్గదర్శకాలను పాటించాలని మంత్రులు ఆదేశించారు.
గ్రేటర్ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. గ్రేటర్ వాసుల కోసం ఇతర జిల్లాల పరిధిలో నిర్మిస్తున్న ఇళ్లలో కనీసం 10 శాతం లేదా 1000 ఇళ్లకు మించకుండా స్థానికులకు ఇవ్వాలన్నారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరైన వారికి మరోసారి మంజూరు కాకుండా చూడాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట మొక్కలు పెంచాలని మంత్రులు సూచించారు. గృహ నిర్మాణ శాఖాధికారులతో త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.